హైదరాబాద్ ఫిబ్రవరి 21 ఈతరం భారతం:
సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. కేవలం అధికారిక హెచ్చరికలకే పరిమితం కాకుండా, సామాన్యులకు సైతం సులువుగా అర్థమయ్యే రీతిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్, ఐపిఎస్ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న ‘జాగృత్ హైదరాబాద్ – సురక్షిత్ హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ నూతన విధానానికి విశేష స్పందన లభిస్తోంది. పోలీసుల పిలుపు మేరకు పలువురు ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, సైబర్ నేరాల తీరుతెన్నులను వివరిస్తూ తమదైన శైలిలో వీడియోలు రూపొందిస్తున్నారు. వీటిని హైదరాబాద్ సిటీ పోలీస్, సిపి విసి సజ్జనార్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలతో ‘కొలాబరేట్’ చేయడం ద్వారా లక్షలాది మందికి చేరువ చేస్తున్నారు. వినోదాత్మకంగా ఉంటూనే, అత్యంత కీలకమైన సైబర్ భద్రతా సూచనలను ఈ వీడియోలు ప్రజలకు అందిస్తున్నాయి
.















