ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 26:
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. గ్రూప్-1, గ్రూప్-2 అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన సీఎం, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లలేని వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు మరియ చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ మరియు హార్వర్డ్ మధ్య ఒక కీలక ఒప్పందం జరగబోతోందని, తద్వారా హార్వర్డ్ ప్రతినిధులే నేరుగా ఇక్కడికి వచ్చి అధికారులకు, విద్యార్థులకు ‘ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్’ తరగతులు బోధిస్తారని ఆయన వివరించారు. ఈ విద్యాసంబంధిత విప్లవాత్మక మార్పులతో పాటు, నూతన అధికారులకు ముఖ్యమంత్రి కొన్ని విలువైన సూచనలు చేశారు. శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లోకి చేరుతున్న అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా, వ్యక్తిగత జీవితంలో తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవంగా, ప్రేమగా చూసుకోవాలని కోరారు. పరిపాలనలో మానవీయ కోణాన్ని మర్చిపోవద్దని, సమాజ సేవలో నిబద్ధతతో ఉండాలని ఆయన హితబోధ చేశారు. హార్వర్డ్ వంటి అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు స్థానికంగా అందుబాటులోకి రావడం వల్ల తెలంగాణ పాలనా యంత్రాంగం మరింత నైపుణ్యంతో పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.















