ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 29
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన డిజిటల్ చెల్లింపుల వేదిక టీ-వాలెట్లో భారీ డేటా చోరీ ఘటన వెలుగులోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. యూజర్లకు సంబంధించిన సున్నితమైన సమాచారం, లావాదేవీల రికార్డులతో పాటు ప్రభుత్వానికి జమ చేయాల్సిన నిధులను సైతం దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.టీ-వాలెట్ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై కేసు నమోదు చేయగా, దర్యాప్తు వేగవంతమైంది. ఒప్పంద గడువు ముగిసిన తర్వాత కూడా ఆ సంస్థ టీ-వాలెట్కు సంబంధించిన యూజర్ డేటా, ట్రాన్సాక్షన్ రికార్డులు, సోర్స్ కోడ్ను ప్రభుత్వానికి అప్పగించకుండా నిలిపివేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసులో ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా సంస్థ చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు సంస్థ సీఈవోతో పాటు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.దర్యాప్తులో భాగంగా టీ-వాలెట్ యూజర్ డేటాను ప్రైవేట్ యాప్కు మళ్లించే ప్రయత్నాలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ డిజిటల్ ఆస్తులైన డేటా, సోర్స్ కోడ్ బదిలీకి కావాలనే అడ్డంకులు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఇక ప్రభుత్వం మరో సంస్థకు ప్రాజెక్ట్ హ్యాండోవర్ చేపట్టాలని నిర్ణయించగా, దానిని కూడా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్లు ప్రాథమిక విచారణలో బయటపడినట్లు సమాచారం. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక డిజిటల్ సేవల భద్రతపై తీవ్ర ఆందోళనలకు దారితీసింది. *పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.















