ఈతరం భారతం హైదరాబాద్ మే 9
ఆధునికీకరణ, పట్టణీకరణతో భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు . పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులురెడ్డి, సీఎస్ శాంతికుమారి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకువెళ్తున్నాం. అండర్ పాస్, సర్వీస్, ఎలివేటెడ్ అనే త్రీ లెవల్ విధానాన్ని తీసుకురావాలి. ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదు. మల్టీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. పార్కింగ్ ఇబ్బందులు అధిగమించేందుకు మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం. కోర్, ప్యూర్, రేర్ గా అభివృద్ధిని మూడు భాగాలుగా విభజించుకున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు కోర్ ఏరియాను సర్వీస్ సెక్టార్ గా గుర్తించాం. ఓఆర్ఆర్ బయట.. ఆర్ఆర్ఆర్ లోపల ఉన్న ప్యూర్ ఏరియాను తయారీ రంగంగా.. ఆర్ఆర్ఆర్ బయట ఉన్న రేర్ ఏరియాను అగ్రికల్చర్ సెక్టార్ గా గుర్తించాం. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్-2047 మాస్టర్ ప్లాన్ ను ఆవిష్కరించుకున్నాం” అని వివరించారు
.














