ఈతరం భారతం హైద్రాబాద్ మే 15 :
విశ్వకర్మ ఫౌండేషన్ అండ్ సేవా ట్రస్ట్ రంగారెడ్డి జిల్లాలోని జిల్లేడు చౌదరిగుడ మండలం రావిర్యాల గ్రామంలో ఎన్ఆర్ఐ వరప్రసాద్ గురజాపు విరాళంగా ఇచ్చిన 2000 గజాల భూమిలో వికె ప్రకృతి వనం పేరిట వృద్ధాశ్రమ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం మే నెల 3 తారీఖున జరిగినట్లు ట్రస్ట్ అధ్యక్షులు తుంపాల వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ భారీ నిర్మాణానికి నిధి సేకరణ కూడా చేపట్టామని, తమ విజ్ఞప్తి కి స్పందించిన విశ్వహిత ఫౌండేషన్ వారు వారి హైదరాబాద్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘లక్ష రూపాయల’ విరాళం విశ్వహిత ఫౌండేషన్ స్థాపకులు నిరంజన్ రెడ్డి అందజేసినట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమానికి విశ్వహిత ఫౌండేషన్ స్థాపకులు వినోద్ పెంజెర్ల, వెంకట్ రమణ లతో పాటు, సురేష్ పెంజర్ల, రామశర్మ లు హాజరయ్యారు. కార్యక్రమానికి అతిధులుగా వెస్సో ట్రస్ట్ నుండి బంగారు తాతారావు, విశ్వంలో విలీనం సేవ ట్రస్ట్ నుండి పెంట శ్రీనివాస ఆచార్య మరియు చైతన్య స్రవంతి ట్రస్ట్ నుండి కడారు వీరబ్రహ్మం హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఐ క్లౌడ్ లాజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చే ప్రమోట్ చేయబడి, ఆగస్టు 2023 లో ప్రారంభింపబడి, అనాధ బాలికల సంరక్షణ మరియు భవిష్యత్తు, సేవా సంస్థలకు ఐటీ సేవల మద్దతు, సెంటర్ ఫర్ పీపుల్ ఫారెస్ట్రీ వారి భాగస్వామ్యంతో అడవి బిడ్డల జీవనోపాధి కార్యక్రమాలు, వెస్సో ట్రస్ట్, విశ్వకర్మ ఫౌండేషన్ అండ్ సేవా ట్రస్ట్, మరియు విశ్వంలో విలీనం సేవ ట్రస్ట్ వంటి సేవా సంస్థలకు ఆర్థిక మద్దతు ఇస్తూ, ఉభయ తెలుగు రాష్ట్రాల సామాజిక సేవలలో ఇతోధికంగా పాల్గొంటున్నట్లు తెలియజేశారు.














