ఈతరం భారతం హైదరాబాద్ మే 20
‘కుర్చీ మడతపెట్టి’ అనే ఒక్క నాటు మాస్ డైలాగ్తో తెలుగు రాష్ట్రాల్లో ఓ ఊపు ఊపేసిన సోషల్ మీడియా సంచలనం ‘కుర్చీ తాత’ ఇకలేరు. హైదరాబాద్లోని కృష్ణానగర్ వాసి అయిన మహ్మద్ పాషా (అలియాస్ కాలా పాషా) బుధవారం హఠాన్మరణం చెందారు. కృష్ణ కాంత్ పార్కులో నడుస్తున్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోగా, నగరంలో తీవ్రంగా ఉన్న ఎండల కారణంగా వడదెబ్బ తగిలి ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
ఒక సాధారణ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు రాత్రికి రాత్రే మీమ్స్, రీల్స్ రూపంలో ఇంటర్నెట్ను షేక్ చేశాయి. ఈ పాపులారిటీ ఎంతలా పెరిగిందంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు, ట్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాలో ఈ డైలాగ్తో ఒక ప్రత్యేక మాస్ సాంగ్నే డిజైన్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ వాయిస్ను రీమిక్స్ చేసి సాంగ్లో పెట్టడమే కాకుండా, కుర్చీ తాతను పిలిపించి ప్రత్యేకంగా పారితోషికం కూడా అందించారు.
గతంలో రెండు మూడు సార్లు ‘కుర్చీ తాత చనిపోయాడు’ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారమయ్యాయి. అప్పట్లో ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఆ పుకార్లను కొట్టిపారేశారు. కానీ ఈసారి నిజంగానే ఆయన వడదెబ్బకు బలవడంతో అటు కృష్ణానగర్ చిత్రపురి వర్గాల్లో, ఇటు సోషల్ మీడియా నెటిజన్లలో తీవ్ర విషాదం నెలకొంది. నెటిజన్లు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున సంతాపం ప్రకటిస్తున్నారు.














