ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 2 :
రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్న నెపంతో, దాన్ని నింపుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను దారిదోపిడీ చేస్తోందని తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రభా గౌడ్ మండిపడ్డారు.పార్టీ రాష్ట్ర కార్యాలయం మీడియా సమావేశం లో మాట్లాడుతూ బీజేపీ ఉద్యోగుల హెల్త్ కార్డ్లకు వ్యతిరేకం కాదని, కానీ దానికి ఒక సరైన ప్రణాళిక ఉండాలని ఆయన పేర్కొన్నారు. కనీసం జీఓ ఆర్డర్ లేకుండా, హెల్త్ కేర్ ట్రస్ట్ గానీ, ఒక సీఈఓను గానీ నియమించకుండా ఈ ప్రక్రియను నడపడం ఉద్యోగులను మోసం చేయడమేనన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులతో చర్చలు జరిపి, ఎంపానెల్డ్ ఆసుపత్రుల జాబితాను, రోగాల వారీగా ప్యాకేజీల వివరాలను వెంటనే పబ్లిష్ చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ప్రీమియం తీసుకోకుండా ‘ఆయుష్మాన్ భారత్’ తో రూ. 5 లక్షల ఉచిత వైద్యం అందిస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజల జేబులు గుల్ల చేస్తోందని విమర్శించారు.
ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇద్దరి దగ్గరా కట్ చేస్తూ, ఏడాదికి రూ. 40,000 వరకు లాక్కోవడం వల్ల ఇది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంటే కాస్ట్లీగా మారిందన్నారు. 25 ఏళ్లు పైబడిన పిల్లలకు ఇది వర్తిస్తుందా? ప్రీమియం లిమిట్ ఎంత? అనే విషయాలపై స్పష్టత లేదని, కేవలం 36% మంది మాత్రమే ఆన్లైన్ నమోదు చేసుకున్నా, మిగతా అందరి జీతాల్లో కోత విధించడం దారుణమని ప్రభా గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల నేడు ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని గుర్తుచేశారు. ఒకపక్క రైతులను, మరోపక్క ఉద్యోగులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే మేల్కొని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ప్రభా గౌడ్ హెచ్చరించారు.














