ఈతరం భారతం హైదరాబాద్, జూన్ 6
హైదరాబాద్ సిటీలో బస్సు ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(బీఆర్టీఎస్)ను అమలు చేసింది. ట్రాన్స్పోర్ట్ ను మరింత సులభతరంగా మార్చేందుకు విదేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఆదేశాలు ఇచ్చారు.ఏయే రోడ్లపై బీఆర్టీఎస్ అమలు చేయవచ్చనే అంశంపై ఇంజినీర్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారంగా, తక్కువ ఖర్చుతో మెట్రో తరహా వేగవంతమైన రవాణా ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ప్రజా రవాణా విధానమే బీఆర్టీఎస్. ఇందులో బస్సుల కోసం ప్రత్యేక లెన్లు ఏర్పాటు చేశారు.ఆ మార్గాల్లో ఇతర వాహనాలను అనుమతించబోరు. ప్రయాణికులు ముందుగానే టికెట్లు కొనుగోలు చేయడంతో బస్సుల్లో సమయం వృధా కాదు. స్టేషన్ ప్లాట్ఫారమ్, బస్సు ఫ్లోర్ ఒకే ఎత్తులో ఉండటంతో వృద్ధులు, దివ్యాంగులు సులభంగా ప్రయాణించవచ్చు. కూడళ్ల వద్ద బస్సులకు ప్రాధాన్యత ఇచ్చే సిగ్నల్ వ్యవస్థను కూడా వినియోగిస్తారు.
ప్రపంచంలోని 170కిపైగా నగరాల్లో బీఆర్టీఎస్ అమలవుతోంది. 1974లో బ్రెజిల్లోని కురిటిబా నగరంలో తొలిసారిగా ఈ విధానాన్ని ప్రారంభించారు. కొలంబియాలోని బోగోటా నగరంలో ‘ట్రాన్స్మిలీనియో’ వ్యవస్థ అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఆసియాలోనే తొలి బీఆర్టీఎస్ నెట్వర్క్ ఏర్పాటైంది. చైనాలోని పలు ప్రధాన నగరాల్లో కూడా ఈ విధానం అమల్లో ఉంది.
మన దేశంలో పూణేలో 2006లో ‘రెయిన్బో’ పేరుతో బీఆర్టీఎస్ ప్రారంభమైంది. అహ్మదాబాద్లో ‘జన్మార్గ్’ పేరుతో ఈ వ్యవస్థ విజయవంతంగా కొనసాగుతోంది. మెట్రోతో పోలిస్తే నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటం, ప్రయాణ సమయం తగ్గడం, కాలుష్యం తగ్గడంలో ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంధన వినియోగాన్ని తగ్గిస్తూ ప్రజా రవాణాను ప్రోత్సహించే దిశగా బీఆర్టీఎస్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దేశ, విదేశాల్లో ఈ విధానం అమలవుతున్న ప్రాంతాలను పరిశీలించి, హైదరాబాద్లో అమలుకు అనువైన మార్గాలు, ఎదురయ్యే సవాళ్లు, పరిష్కార మార్గాలపై అధ్యయనం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.














