ఈతరం భారతం వేముల వాడ జూన్ 15
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ చొరవతో ఎయిర్ ఫోర్స్ విమానం ఏర్పాటు పనులు వేగవంతం.గుట్టపైకి చేరుకున్న విడిభాగాలు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దత్తత దేవాలయమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన నాంపల్లి గుట్ట త్వరలోనే పర్యాటక ఆకర్షణగా మారనుంది. గుట్టపై భారత వైమానిక దళానికి చెందిన విమానాన్ని ఏర్పాటు చేయడానికి చేపట్టిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానం విడిభాగాలను ప్రత్యేక వాహనాల ద్వారా గుట్టపైకి సోమవారం తరలించారు. పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో నాంపల్లి గుట్టపై ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ప్రతిష్ఠించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే విమానం ప్రధాన విడిభాగాలు గుట్టపైకి చేరుకోగా,వాటి ఏర్పాటు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. విమానం ఏర్పాటు పూర్తయిన తర్వాత నాంపల్లి గుట్టకు వచ్చే సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
ప్రకృతి సోయగాలు,ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన నాంపల్లి గుట్టకు ఈ విమానం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. విమానం ఏర్పాటు పూర్తయిన అనంతరం ఈ ప్రాంతం జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత గుర్తింపు పొందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.అధికారుల సమన్వయంతో కొనసాగుతున్న ఈ పనులు త్వరలో పూర్తికానుండగా,నాంపల్లి గుట్ట పర్యాటక శోభను సంతరించుకుని సందర్శకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.















