ఈ తరం భారతం వికారాబాద్ జూన్ 27:
డే కేర్ సెంటర్ పండుటాకులకు చల్లని నీడలా మారింది.జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఆయా రంగాలలో ఎంతో అనుభవం గడించిన వృద్ధుల తమ అనుభవాలను కష్టసుఖాలను పంచుకునేందుకు వేదికవుతున్నది. ఇక్కడికి వచ్చే వారిలో ప్రధానంగా ప్రభుత్వ మాజీ ఉద్యోగులు, కార్మికులు, వ్యాపార సంస్థల్లో పని చేసిన వారు, వ్యవసాయంలో ఆరితేరిన వారు, ఒకప్పటి కవులు, రచయితలు, కళాకారులు ఉంటున్నారు. వీరు రోజంతా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఇక్కడికి వచ్చి సమ వయస్కులతో గడపటం వల్ల తమ కష్టాలను మరిచిపోతున్నామని చెబుతున్నారు.
డే కేర్ సెంటర్ పండుటాకులకు చల్లని నీడలా మారింది. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భవనములో అన్ని రకాల దినపత్రికలు, క్రీడా పరికరాలు అందుబాటులో ఉండటంతో పాటు సమ వయస్కులతో కబుర్లు చెప్పుకునే అవకాశం ఉండటంతో వృద్ధులకు మంచి కాలక్షేపమవుతుంది. అంతేకాదు పిల్లల ఆదరణ కరువైన పెద్దల్లో మనోధైర్యం నింపుతుంది.జీవితంలో ఎక్కువ సమయము పిల్లల ఉన్నతికే పాటుపడ్డారు. ప్రస్తుతము వృద్ధాప్యానికి చేరారు. వీరిలో చాలామంది పరిస్థితి దయనీయంగా మారింది. వృద్ధులను పిల్లలు పట్టించుకోకపోవడంతో నిరాదరణకు గురవుతున్నారు. ఇది ఆందోళనకర పరిణామం. కొందరు ఉద్యోగం, ఉపాధి కోసం విదేశాలలో ఉంటే, ఇక్కడ ఉంటున్నటువంటి తల్లిదండ్రులకు ఒంటరితనం తప్పడం లేదు. ఇలాంటి వయోవృద్ధుల ఇబ్బందులను దూరం చేయాలనే లక్ష్యముతో డే కేర్ సెంటర్లు ఏర్పాటుకు ప్రభుత్వము నిర్ణయించింది. జిల్లాకు ఒకటి చొప్పున మంజూరు చేసినారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వికారాబాద్ లో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి మాట్లాడుతూ ఇంట్లో ఒంటరిగా జీవనం సాగిస్తున్న వారికి డే కేర్ సెంటర్ తో ప్రయోజనం చేకూరుతుందని, కొందరు కుమారులు, కుమార్తెల వద్ద ఉంటున్నారని, కుటుంబీకులు ఉద్యోగాలకు, వారి పిల్లలు పాఠశాలలకు వెళితే సాయంత్రం వరకు ఇంట్లో ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి. డే కేర్ సెంటర్ కు వెళితే అక్కడ సాయంత్రం వరకు కాలక్షేపము చేసేందుకు వీలు ఉంటుందని సాయి చౌదరి తెలిపారు. డే కేర్ సెంటర్లలో చేరాలంటే ముందుగా పేర్ల నమోదు చేసుకోవలసి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేరేందుకు అర్హత కల్పిస్తారు. సెంటర్లో వంటగది ఉంటుంది. నమోదైన వారికి ఒక పూట భోజనము అందిస్తామని, ఉదయము పూట రాగి జావ గాని, పండ్లు గాని, టీ గాని, బిస్కెట్లు గాని, ఉప్మా వంటివి అందిస్తున్నామని సాయి చౌదరి తెలిపారు. విశాలమైన హాలుతోపాటు, క్యారమ్స్ వంటి ఆట వస్తువులను ఏర్పాటు చేస్తామ,ని ఆధ్యాత్మిక, సాహిత్య, దినపత్రికలతో కూడిన గ్రంథాలయం ఉంటుందని సాయి చౌదరి తెలిపారు. కావున వయోవృద్ధులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవలసిందిగా కోరారు.















