ఈతరంభారతం తిరుపతి జూలై 27 రిపోర్టర్ మనోజ్ కుమార్:
తిరుపతి నగరంలో వాహనాలపై అనధికారికంగా వినియోగిస్తున్న “On Govt Duty”, “Police”, “Press” తదితర అధికారిక గుర్తింపు స్టిక్కర్లపై జిల్లా పోలీసులు సోమవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్పీ పర్యవేక్షణలో ట్రాఫిక్ సీఐ భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ డ్రైవ్లో అనుమతి లేని అధికారిక స్టిక్కర్లను తొలగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలు, పోలీసు విభాగం లేదా మీడియా సంస్థల పేర్లు, లోగోలు, అధికారిక గుర్తింపులను అనుమతి లేకుండా వాహనాలపై వినియోగించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహన చట్టం మరియు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు చట్టబద్ధమైన అనుమతి లేని స్టిక్కర్లు, లోగోలు వినియోగించకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రజల భద్రత దృష్ట్యా ట్రాఫిక్ నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండదని, ప్రభుత్వ హోదాలు, అధికారిక గుర్తింపులను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రత్యేక తనిఖీలు జిల్లా వ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.















