ఈతరం భారతం తిరుపతి, జూలై 02 రిపోర్టర్ మనోజ్ కుమార్ :
స్వర్ణాంధ్ర–2047 విజన్ సాధనలో ఆర్థిక మేధస్సు, సమర్థవంతమైన ప్రణాళికలు, ఆధునిక పాలనా విధానాలు కీలక పాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో గురువారం ప్రారంభమైన “స్వర్ణాంధ్ర 2047 – ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్” రాష్ట్రస్థాయి కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్కు ఆయన హాజరై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల పాటు జరిగే ఈ రాష్ట్రస్థాయి సదస్సులో ప్రభుత్వ విధానాల రూపకల్పన, సమర్థవంతమైన అమలు, డేటా ఆధారిత నిర్ణయాలు, ఆర్థిక ప్రణాళికలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పరిపాలన వ్యవస్థను సన్నద్ధం చేయడం వంటి అంశాలపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనకు ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్ని విధాలుగా సిద్ధం చేయడమే ఈ వర్క్షాప్ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ కార్యదర్శి సౌరబ్ గార్గ్ , భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి . అనంత నాగేశ్వరాన్, నీట్ ఆయోగ సభ్యుడు బాలసుబ్రమణ్యం, ప్రొఫెసర్ కె. వి. రాజు, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు ఎస్ . మహేంద్ర దేవ్ పాల్గొన్నారు. వర్క్షాప్ సందర్భంగా నిర్వహించిన ప్యానల్ చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని, ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, డేటా ఆధారిత పరిపాలన ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి అధికారుల సామర్థ్య పెంపు అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.















