ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ ఏప్రిల్ 12
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడమే కాకుండా, యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చేలా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. సుమారు 21 గంటల పాటు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన హై-వోల్టేజ్ సమావేశాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాలను పూర్తిగా మూసివేయాలన్న అమెరికా డిమాండ్ను ఇరాన్ నిర్ద్వద్వంగా తిరస్కరించింది. తాము ఇచ్చిన ‘తుది ఆఫర్’ను ఇరాన్ తోసిపుచ్చడంతో చర్చలు ముగిసినట్లు వాన్స్ ప్రకటించారు. ఈ చర్చల వైఫల్యం తర్వాత స్పందించిన డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ను పూర్తిగా అంతం చేయడానికి సిద్ధమని హెచ్చరిస్తూ, ఆ దేశంపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.చర్చలు విఫలమైన వెంటనే ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా నౌకాదళాన్ని ఆదేశించారు. ఇరాన్కు అక్రమంగా టోల్ చెల్లించే ప్రతి నౌకను అడ్డుకోవాలని, ఒకవేళ అమెరికా దళాలపై కాల్పులు జరిగితే తీవ్రంగా స్పందించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ప్రపంచ దేశాలను ఆందోళనలోకి నెట్టింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గాన్ని మూసివేస్తే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ కుప్పకూలుతుందని, చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయని యూఏఈ వంటి దేశాలు హెచ్చరిస్తున్నాయి.
మరోవైపు, ఇప్పటికే ఇరాన్ పై జరుగుతున్న దాడుల కారణంగా అక్కడ భారీ ప్రాణనష్టం సంభవించింది. తాజా గణాంకాల ప్రకారం 3,375 మంది మరణించగా, అందులో వందలాది మంది చిన్నారులు ఉండటం అంతర్జాతీయ సమాజాన్ని కలచివేస్తోంది. అమెరికా షరతులు అహేతుకమని ఇరాన్ విదేశాంగ శాఖ విమర్శిస్తుండగా, చర్చలకు సహకరించిన పాకిస్థాన్ మాత్రం భవిష్యత్తులో మళ్లీ ప్రయత్నిస్తామని అంటోంది. ఏదేమైనా, అగ్రరాజ్యం తన నౌకాదళాన్ని రంగంలోకి దింపడంతో పశ్చిమాసియాలో మూడో ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.



