ఈతరం భారతం హైదరాబాద్ జూలై 15
ఆషాఢమాసాన్ని శూన్యమాసం అన్నారు, అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయరు, కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి.ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిధి, దీనికి తొలి ‘ఏకాదశి’ అని పేరు.ఇక్కడి నుంచి ఇక ప్రతి వారానికి, ప్రతి 15 రోజులకొకసారైనా ఏదో ఒక పండుగ, వ్రతం, పూజ ఉంటుంది.తొలి ఏకాదశి నుంచి ‘చాతుర్మాస్య వ్రతం.! ప్రారంభిస్తారు.దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే..!ఆషాడమాసంలో అందరు గోరింటాకు పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు.ఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ, వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపినవాడు గురువైతే , లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు.గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు.తెలంగాణలో గ్రామదేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన(బోనం) తీసుకెళ్ళి అర్పించి బోనాలు మొదలయ్యేది ఆషాఢంలోనే. సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాధుడి రథ యాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే.అమ్మలుగన్న అమ్మ, ముగ్గురమ్మ మూలపుటమ్మ జగజ్జననీ సకల జీవులకు ఆహారం అందించిన శాకంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే. ఈ మాసంలో .’శాకంబరీ నవరాత్రులు’ కూడా చేస్తారు. వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్తమాతృకలు, మహిషాసుర మర్దిని, దుర్గా దేవిని, భైరవ, వరహా, నారసింహుల ఆరాధన చేయాలి.శూన్యమాసం అంటే భయాలను కలిగించేందుకు వచ్చింది కాదు, శాస్త్రీయ కారణాల వల్ల ఆషాడాన్ని శూన్యమాసంగా నిర్ణయించారు పెద్దలు.















