హైద్రాబాద్(బాలాపూర్)జులై 20.(ఈతరం భారతం)వేపాకు తోరణాలు… డప్పు చప్పుళ్లు… పోతురాజుల విన్యాసాలు… అమ్మవారి పూనకాలు… లయబద్దమైన పదనర్తనలతో నగరంలో ఎటు చూసినా బోనాలు సందడిగామారాయి.బాలాపూర్ మండలంలోని జె. పి. మహానగర్ లో కొలువై ఉన్న అమ్మ వారి ఆలయంలోనూ భక్తిశ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి, మొక్కులుతీర్చుకోడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.అమ్మవారి ఆశీస్సుల కోసం.. బోనాలతో తరలివచ్చిన మహిళలే ఎక్కువగా కన్పించారు.
సామూహికంగా బోనాలు సమర్పిస్తూ సౌభాగ్యాలను ప్రసాధించాలని అమ్మవారిని వేడుకున్నారు.ఆషాడమాసంలో ఆఖరి ఆదివారం కావడంతో అమ్మ వారి దివ్యసన్నిధిని పుష్పాలంకరణతో శోభామానంగా తీర్చిదిద్దారు. తద్వారా ఆలయ సందర్శన ప్రత్యేక అనుభూతినిచ్చింది. ఆషాడమాసంలో శక్తి స్వరూపిణి అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయని తమ ప్రగాఢ విశ్వాసమని అక్కడి భక్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారుకాగా, ఆలయ కమిటీ బృందం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.















