హైదరాబాద్ జూలై 27 (ఈతరం భారతం );మౌలాలి నివాసి వి. హర్షవర్ధన్ (32) గత ఆరు సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధి తో బాధపడుతున్నారు.రోజు విడిచి రోజు డయాలిసిస్ చేయించుకుంటున్నారు. కోవిడ్ సమయంలో తన తండ్రిని కోల్పోయిన హర్షవర్ధన్ ప్రస్తుతం తల్లితో కలిసి తనకు మద్దతునిస్తున్న బంధువుల అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. మొదట్లో ఆయన ఒక BPO సంస్థలో పని చేస్తూ, ఆరొగ్యశ్రీ పథకం ద్వారా డయాలిసిస్ చేయించుకునేవారు. అయితే, డయాలిసిస్ చికిత్సలో గడిపే 5 గంటల సమయం, తదనంతర శరీర బలహీనత వల్ల క్రమేపి ఉద్యోగం చేయలేని స్థితికి వచ్చారు. బహుశా మానసిక ఒత్తిడి వలన కాబోలు, ఇటీవల ఆయనకు మెదడులో క్లాట్ కూడా ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు! ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆసుపత్రి లో ఆరోగ్యశ్రీ పథకం రద్దు కావడంతో అతను చికిత్స పొందడం మరింత కష్టంగా మారింది. తన నివాసానికి దూర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రయాణించేందుకు ఆయన ఆరోగ్య/ఆర్థిక పరిస్థితి సహకరించటం లేదు.ప్రారంభంలో బంధు మిత్రుల నుండి ఆర్థిక సహాయం అందినా, అది క్రమేపి తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం, తన ఆరోగ్య పరిస్థితి అవయవ దానానికి కూడా అనుకూలంగా లేదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, సామాజిక సేవకురాలు దొడ్డోజు సావిత్రి గారి ద్వారా వెస్సో ట్రస్ట్ గురించి తెలుసుకొని తన వైద్య చికిత్స కొరకు ఆర్థిక సహాయం చేయమని వెస్సో ని కోరారు. వెస్సో ట్రస్టీలు గౌరవ దాతల సహకారంతో హర్షవర్ధన్ కు రూ. 50000/-లు అందజేశారు.
–















