ఈతరం భారతం హైదరాబాద్, మే 28:
గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ(జీహెచ్ జే ఎంఏసీ హెచ్ సీ) సర్వసభ్య సమావేశం జూన్ 3వ తేదీ ఉదయం 10 గంటలకుచిక్కడపల్లిలోని త్యాగరాయగానసభ లో జరుగుతుందని సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు మామిడి సోమయ్య, బొల్లం శ్రీనివాస్ లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇచ్చేందుకు ఇటీవల ప్రక్రియను ప్రారంభించిన సందర్బంలో జరుగుతున్న ఈ సర్వసభ్య సమావేశం అత్యంత కీలకమైనదని, సొసైటీ సభ్యులందరు ఈ సమావేశానికితప్పనిసరిగా హాజరుకావాలని వారు ఒక ప్రకటనలో కోరారు.జీహెచ్ఎంసీ పరిధిలో పని చేస్తున్న దాదాపు 1350 మంది ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సొసైటీలో సభ్యులుగా ఉన్నారని,వీరిలో అత్యధిక శాతం జర్నలిస్టులు ఇరవై నుంచి 30 ఏళ్ళ సీనియారిటీ కలిగి ఉన్నారని పేర్కొన్నారు. 2008 నుంచి ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు సొసైటీలో సభ్యులుగా ఉండి ఇళ్ళస్థలాల కోసం ఎదురు చూస్తున్నారని, కొంతమంది సీనియర్ పాత్రికేయులు ఇళ్ళస్థలాలు పొందకుండానే చనిపోయారని వారు తెలిపారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం వచ్చేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. జూన్ 3న జరిగే సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఇళ్ళస్థలాల సమస్య పై చర్చించి ఇళ్ళస్థలాల సాధనకు కార్యాచరణను రూపొందిస్తామని, ఇందుకోసం సీనియర్ సభ్యులతో కమిటీ వేస్తామని వారు పేర్కొన్నారు.














