ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 1
టిపిసిసి ఎస్ సి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ విద్యావేత్త, సామాజికవేత్త ప్రొఫెసర్ తలారి ప్రేమయ్య సోమవారం నియమితులయ్యారు. ఈ మేరకు టిపిసిసి రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేసి గాంధీభవన్ లో నియామక పత్రాన్ని ప్రేమయ్యకు అందజేసి అభినందించారు. కామారెడ్డి జిల్లా భీభీపేట మండలం తుజాల్ పూర్ గ్రామానికి చెందిన ప్రేమయ్య ఇంటర్, డిగ్రీ సిద్దిపేటలో, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ( పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్), ఎంఫిల్, బిఈడి, ఎల్ఎల్ బి, పీహెచ్ డి చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టి , టిఎస్ఎఫ్( తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ ) సంఘాల ఉద్యమాలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో చురుకుగా ప్రేమయ్య పాల్గొన్నారు. 1995 నుండి నిజాం కాలేజీలో పార్ట్ టైం ప్రొఫెసర్ గా చేరి కొంతకాలానికి పూర్తిస్థాయిలో ప్రొఫెసర్ గా మారి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలకు బదిలీ అయి 2024లో అక్కడ పదవీ విరమణ చేశారు. 2010 నుండి కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల్లో ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తూ తమ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ నాయకత్వ సహచర్యంతో అనేక కార్యక్రమాలలో హైదరాబాద్ మొదలుకొని జిల్లా స్థాయి వరకు ప్రేమయ్య పాల్గొన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పలు తెలంగాణ జిల్లాల్లో నిర్వహించిన సర్వేలలో ప్రేమయ్య క్రియాశీల పాత్రను నిర్వహించారు. తనకు రాష్ట్రస్థాయిలో ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పదవి కల్పించినందుకు షబ్బీర్ అలీ, సురేష్ కుమార్ షట్కర్ తో పాటు రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ సత్యనారాయణకు ప్రేమయ్య కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సారధ్యంలో పార్టీ పురోభివృద్ధికి తన వంతు కృషిని కొనసాగిస్తానని ఆయన చెప్పారు.














