EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణలో వచ్చేది మన ప్రభుత్వమే:మోదీ

ఈతరం భారతం హైదరాబాద్ మే 10

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, తెలంగాణ రాజకీయాల్లో మార్పు మొదలైందని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని, సుపరిపాలన కోసం ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన చారిత్రక విజయాన్ని ప్రధాని తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. “నిన్న బెంగాల్‌లో తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడ నియంతృత్వ పోకడలను ఓడించి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు” అని మోదీ అన్నారు. అదే ఉత్సాహం ఇప్పుడు తెలంగాణలో కూడా కనిపిస్తోందని, అసోంలో హ్యాట్రిక్, పుదుచ్చేరిలో విజయం తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు కుటుంబ పాలన కంటే విశ్వాసాన్నే ఎంచుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ తీరుపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఇప్పుడు విభజన రాజకీయాలకు కేంద్రంగా మారిందని ఆరోపిస్తూ, ఆ పార్టీని ‘ఎంఎంసీ’ (ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్) అని ప్రజలు పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఎలాగైతే గాలికి వదిలేసిందో, తెలంగాణలో కూడా అదే పునరావృతమవుతోందని విమర్శించారు. మావోయిస్టు ఉగ్రవాదం చివరి దశలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ వారిని కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

ఒకప్పుడు దేశంలో బీజేపీకి ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు, అందులో ఒకరిని అందించిన చరిత్ర తెలంగాణదని మోదీ గుర్తుచేశారు. “నేడు రాష్ట్రంలోని ఎంపీల్లో సగం మంది బీజేపీ వారే ఉన్నారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తల కష్టం వృధా పోదు, వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఇక్కడ మా ప్రభుత్వం ఏర్పడుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు. డప్పు కొట్టి కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన మోదీ, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని పునరుద్ఘాటించారు.

Related News

Select the Topic
Scroll to Top