EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ మోడల్‌కు సహకరించండి…

ఏతనం భారతం హైదరాబాద్ మే 10

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఆయన హిందీలో ప్రసంగిస్తూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పినట్లుగా.. ప్రధాని తన ‘పెద్ద మనసు’తో తెలంగాణ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

“ఇది అభివృద్ధి ఉత్స‌వం. కేంద్ర ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం కాదు. జాతీయ భద్రత, జాతీయ అభివృద్ధే మ‌న‌కు అత్య‌ధిక ప్రాధాన్యం. ముందు భార‌త దేశం, తర్వాత ప్రజలు, ఆ త‌ర్వాతే పార్టీ అనేది స్ప‌ష్టం. ఆ స్ఫూర్తితోనే దేశ నిర్మాణానికి ప్ర‌ధాన‌మంత్రి మోదీ వికసిత్ భారత్ 2047ను ప్రకటించినప్పుడు, మేము భాగస్వాముల‌య్యాం. తెలంగాణ రైజింగ్‌ కు మీరు పూర్తి సహకారం అందిస్తారనే విశ్వాసం మాకు ఉంది. తెలంగాణ‌ను దేశంలో మొద‌టి స్థానంలో నిలిపేందుకు మేం ప్ర‌య‌త్నిస్తున్నాం. కాక‌తీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌, రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించేందుకు మోదీ వ‌చ్చారు” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ లక్ష్య సాధన కోసం ఒక ఆసక్తికరమైన పోలికను ప్రధాని ముందుంచారు. “గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు మీ ‘గుజరాత్ మోడల్’కు ఆయన సహకరించారు. ఇప్పుడు మీరు ప్రధానిగా ఉండగా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. రాష్ట్ర ప్రజలు నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రానున్న పదేళ్లలో ‘తెలంగాణ మోడల్’ నిర్మించి, 2034 నాటికి రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి మీ ఆశీస్సులు, సహకారం ఎంతో అవసరం” అని రేవంత్ విజ్ఞప్తి చేశారు.

 

Related News

Select the Topic
Scroll to Top