హైదరాబాద్, జూలై 15 (ఈతరం భారతం): హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్నగర్ శాలివాహననగర్లోని పార్క్ వద్ద సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్ను గన్తో కొందరు దుండగులు కాల్చి చంపడం కలకలం రేపింది. తన భర్త చందు నాయక్ హత్యపై నారి భాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజూ ఉదయం తాము, తమ మిత్రులతో కలిసి వాకింగ్ వెళ్తామని.. ఈరోజు కూడా అలానే అందరం కలిసి వాకింగ్ వెళ్ళమని చెప్పారు. కానీ ఇలా తన భర్తను తనకు లేకుండా చేస్తారని కలలో కూడా ఊహించలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు.
నా భర్త ముందే చెప్పాడు..
తాము వాకింగ్ చేస్తున్న సమయంలో అక్కడి ఓ కారులో కొంతమంది వచ్చారని ఆమె చెప్పారు. అది గమనించిన నేను.. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారని నా భర్తను అడిగానని.. వెంటనే వవాళ్ళని చూసిన నా భర్త డల్ అయ్యారని చెప్పింది. అక్కడి నుంచి తమని వెళ్ళమని ఆయన చెప్పాడని.. ఆ కారులో రాజేష్, సుధాకర్ తో పాటు మరికొంత మంది ఉన్నారని ఆమె చెప్పారు. అయితే రాజేష్ మాజీ మావోయిస్టు అని, అతని వద్ద గన్స్ ఉన్నాయని తన భర్త చాలా సార్లు చెప్పేవారని అన్నారు.కుంట్లూరు గుడిసెల వ్యవహారంలో రాజేష్ డబ్బులు వసూలు చేసేవాడని.. ఇదే అంశంపై అతడిని తన భర్త మందలించి పార్టీ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. ఈ కోపంతోనే తన భర్తను వాళ్ళు చంపారని.. తన భర్తను ఎలా కాల్చి చంపారో.. నిందితులను కూడా అలానే కాల్చి చంపాలని చందు నాయక్ భార్య నారి భాయ్ డిమాండ్ చేశారు. కాగా ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.















