ఈతరం భారతం హైద్రాబాద్ మే 28 :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలిచేవిధంగా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం ఫ్యూచర్ సిటీలో నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) కార్యాలయ భవనం, స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు.
అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి : ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్ సిటీని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తోందని తెలిపారు. విద్య,నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్రంగా స్కిల్ యూనివర్సిటీ నిలవబోతుందని పేర్కొన్నారు.
నగర అభివృద్ధి పనులకు మరింత వేగం : ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ద్వారా నగర అభివృద్ధి పనులకు మరింత వేగం చేకూరుతుందని అన్నారు. నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్ధి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు.
“లక్షలాది మందికి ఉపాధి, వారికి ఉద్యోగ భద్రత కల్పించే ఒక మంచి ఆలోచనతో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. ప్రపంచంలో ఏ దేశానికి ఏ రాష్ట్రానికి రాని ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహచర మంత్రివర్గానికి వచ్చింది. సీఎం, మంత్రివర్గ కలిసి చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి ప్రతిపక్షాలు కూడా సహకరిస్తాయని అనుకుంటున్నాం. మరింత ఉత్సాహంతో పని చేస్తున్నాం. ఫ్యూచర్ సిటీ దేశానికి తలమానికం కానుంది. ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా రూపుదిద్దుకుంటోందన్నారు.”అత్యుత్తమ సాంకేతికతతో రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోంది. గ్లోబల్ ప్రజెన్స్ ఉన్న కార్యాలయాలు కూడా ఫ్యూచర్ సిటీ నుంచే నడపాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్లు ఏదిపడితే అది మాట్లాడతారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను చెడగొట్టే ప్రయత్నం ఎవరూ చేసిన ఊరుకునేది లేదు. మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి. మేము మా పనితనం చూపిస్తూనే ఉంటామన్నారు.














