ఈతరం భారతం హైదరాబాద్ మే 15
నాంపల్లి రైల్వే స్టేషన్లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జైపూర్కు వెళ్లాల్సిన రైలులోని ఏసీ కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. 4వ ప్లాట్ఫాంపై నిలిపి ఉంచిన రైలులోని బీ1, బీ2 ఏసీ బోగీల్లో షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. రాత్రి 7.30 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలులో సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలోనే పొగలు కనిపించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.
మంటలు వేగంగా వ్యాపించడంతో బోగీల్లో పొగలు నిండిపోయాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కొంతమంది ప్రయాణికులు, స్థానికులు కలిసి బోగీల అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.సమాచారం అందుకున్న ఫైర్, హైడ్రా సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మూడు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.














