ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 28
విధి నిర్వహణలో క్షణం తీరికలేకుండా, కుటుంబానికి దూరంగా గడిపే పోలీసుల కు ఒత్తిడితో కూడిన వారి విధులను, సమాజం కోసం వారు చేస్తున్న వ్యక్తిగత త్యాగాలను గుర్తిస్తూ పోలీసు శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి పోలీసు అధికారి, సిబ్బందికి వారి పుట్టినరోజు తో పాటు పెళ్లిరోజు నాడు కచ్చితంగా సెలవు మంజూరు చేయాలని రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన పోలీసు శాఖలోని అన్ని విభాగాలకు ఓ సర్క్యులర్ మెమో జారీ చేశారు.కుటుంబంతో సంతోషంగా గడిపేలా.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పండుగలు, పబ్బాలు, సెలవులు వదులుకుని నిరంతరం విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలో వారి మనోధైర్యాన్ని పెంచడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ర్యాంకులతో సంబంధం లేకుండా కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరికీ ఈ సెలవు వర్తిస్తుంది.
తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ రెండు రోజులను ప్రతి పోలీసు అధికారి తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు, వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకునేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని డీజీపీ ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు. పోలీసు బలగాలు కనబరుస్తున్న అంకిత భావానికి గుర్తింపుగానే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే.. ఈ సెలవు మంజూరుకు సంబంధించి డీజీపీ కొన్ని మార్గదర్శకాలను విధించారు.
అసాధారణ, అత్యవసర పరిస్థితులు ఉంటే మినహా.. సాధారణ సమయాల్లో సిబ్బంది కోరిన వెంటనే యూనిట్ అధికారులు విధిగా ఆయా రోజుల్లో సెలవు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. ఈ సెలవును సిబ్బంది తమ జన్మహక్కుగా భావించకూడదని, అత్యవసర పరిస్థితుల్లో సెలవును నిరాకరించే అధికారం మంజూరు చేసే ఉన్నతాధికారికి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే.. సర్వీస్ రిజిస్టర్లో నమోదైన పక్కా ఆధారాల తేదీల ప్రకారం మాత్రమే ఈ సెలవు ఇస్తారు. ఈ అవకాశం వినియోగించుకోవాలనుకునే వారు విధిగా ముందుగానే తమ పైఅధికారులకు రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అని తెలిపారు.















