హైదరాబాద్ మార్చ్ 10 ఈతరం భారతం:
ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదలు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడ బెట్టుకుని కట్టుకున్నఇళ్లను రేవంత్ సర్కార్ బుల్డోజర్లతో నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరించిన తీరుతో పేదలకు నిలువ నీడ లేకుండా పోయింది. కాంగ్రెస్ సర్కార్ పేదలను వారి ఇళ్లలో నుంచి బలవంతంగా ఖాళీ చేయించి ఇళ్లను కూల్చేసింది. ప్రభుత్వ చర్యలతో భూదాన్ భూముల్లో ఇండ్లను కోల్పోయిన పేదలు నిర్ధాక్షిణ్యంగా రోడ్డున పడ్డారు.కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యంపై వెలుగుమట్ల బాధితురాలు తీవ్రంగా మండిపడ్డది. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. ఇల్లు కోల్పోయిన వాళ్ల ఆవేదనను పంచుకుంది. మా భూములు మాకివ్వాలి.. మీరిచ్చేది కాదు.. మిమ్మల్ని ఇవ్వమని మేం అడగడం లేదు. ముందు రండి. లా అండ్ ఆర్డర్ ప్రకారంగా వెళ్దామని అడుగుతున్నాం. ఒక్కొక్కరికి నష్టపరిహారాలు చెల్లించాలి. మీ సొమ్ము తీసుకుని మేం ఇళ్లు కట్టుకోలేదు. మా సొమ్ము మీద ఇలా చేయడానికి మీకే మాత్రం అర్హత లేదు. అక్కడున్న ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసింది.కట్టుబట్టలతో ఇండ్లలో నుంచి బయటకు వచ్చి నిరాశ్రయులైన బాధితులు సామాగ్రితో చెట్ల కింద, వాహనాల్లో తలదాచుకుంటున్న దృశ్యాలు ఇప్పటికే అందరినీ కలిచి వేస్తున్నాయి. వెలుగుమట్ల బాధితుల దయనీయ పరిస్థితి ఎలా ఉందో కళ్లకు కట్టినట్టు చూపించే దృశ్యాలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని తెలిసిందే.















