ఈతరం భారతం హైదరాబాద్ మే 31 :
యువత స్ఫూర్తి పొందేలా ప్రధాని మోదీ గారి ‘మన్ కీ బాత్’ ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన 134వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు హైదరాబాద్లోని హిమాయత్ నగర్, కె.ఎం.ఐ.టి లేన్ వద్ద పార్టీ నాయకులతో కలిసి ఉత్సాహంగా వీక్షించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతి ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్ ద్వారా దేశానికి అవసరమైన అనేకస్ఫూర్తిదాయకమైన విషయాలను పంచుకుంటున్నారని రాంచందర్ రావు పేర్కొన్నారు. క్రీడల్లో మన క్రీడాకారులు కనబరుస్తున్న ప్రతిభ, వారు పడుతున్న కష్టం, వారి విజయగాథలు యువతకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.ముఖ్యంగా అథ్లెటిక్స్లో మన వారు సాధిస్తున్న అద్భుతమైన రికార్డులు భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటుతున్నాయని కొనియాడారు.అంతేకాకుండా, చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ రాజరాజ చోళుని సముద్రయాన ఘనతను, సాహసాలను ప్రధాని గుర్తు చేయడం అభినందనీయమని అన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను, అలాగే మన సంప్రదాయ స్వదేశీ పానీయాలైన మామిడి పన్నా, సత్తు, సబ్జా గింజలతో తయారు చేసే రసాల ప్రాముఖ్యతను వివరించడం ద్వారా సామాన్య ప్రజలకు మేలు జరిగేలా ప్రధాని దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు.
మన్ కీ బాత్ లోని ప్రతి ఎపిసోడ్ కొత్త సమాచారాన్ని, కొత్త స్ఫూర్తిని ఇస్తుందని, అందుకే ఈ కార్యక్రమాన్ని దేశ యువత తప్పక చూడాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ అభయ పాటిల్ గారు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ , బిజెపి రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్, జి.మాధవి తదితరులు పాల్గొన్నారు.














