ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 4 :
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తీసుకున్న సరికొత్త నిర్ణయంతో మద్యం ప్రియులకు మంచి కిక్కు ఇచ్చింది. రాష్ట్రంలో ఇకపై సరికొత్త పరిమాణాల్లో 150ml (మిల్లీలీటర్లు), 200mlమద్యం సీసాలు కూడా మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం కాకుండా, ఈ కొత్త సైజుల్లో మద్యం సీసాలను తయారు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ పలు ప్రముఖ లిక్కర్ తయారీ కంపెనీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. కంపెనీల అభ్యర్థనను పరిశీలించిన ఎక్సైజ్ శాఖ, పాత రూల్స్ను సవరిస్తూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ధరల విధానంలో మార్పు లేదు
ఈ నూతన ఉత్తర్వులలో భాగంగా, కొత్త పరిమాణాల్లో వచ్చే మద్యం బాటిళ్లకు సంబంధించి ఒక కేసులో (బాక్స్) ఖచ్చితంగా ఎన్ని సీసాలు ఉండాలి అనే ప్యాకింగ్ నిబంధనలను కూడా ఎక్సైజ్ శాఖ స్పష్టంగా ఖరారు చేసింది. అయితే, కొత్త సైజుల్లో మద్యం వస్తున్నప్పటికీ ధరల విషయంలో ఎలాంటి అదనపు మార్పులు ఉండబోవని.. ప్రస్తుతం మార్కెట్లో అమల్లో ఉన్న ధరల విధానమే ఈ కొత్త పరిమాణంలోని సీసాలకు వర్తించనుందని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ప్ర స్తుతం ఆంధ్రప్రదేశ్లో 90ml, 180ml, 375ml, 750ml మరియు లీటర్ బాటిల్స్ విక్రయాలు సాగుతుండగా.. త్వరలోనే ఈ జాబితాలోకి 150ml, 200ml సీసాలు కూడా చేరనున్నాయి.














