ఈతరం భారతం జూలై 27 హైదరాబాద్ :డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చదువుతో కూడిన ఉపాధి మార్గాలను విద్యార్థికి అందించేందుకు సంసిద్ధమైంది. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో (RASCI) రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం జూబ్లీహిల్స్ లో ఈనెల 31 వ తేదీన పెద్ద ఎత్తున జాబ్ మేళా జరగనున్నది. 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగి యూనివర్సిటీ పరిధిలోని కోర్సులలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు అర్హులు. అర్హులు. యూనివర్సిటీలో ప్రస్తుతం చదువుతున్న ఫస్ట్, సెకండ్, ఫైనల్ ఇయర్ విద్యార్థులతో పాటు గతంలో ఇదే యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసుకున్న 27 సంవత్సరాలలోపు వయసు కలిగిన విద్యార్థులు ఐడీ కార్డు, రెజ్యూమ్, రెండు పాస్ ఫొటోలతో యూనివర్సిటీ లో జరిగే జాబ్ మేళాకు హాజరుకావాలని విశ్వవిద్యాలయ అధికారులు కోరారు.

జాబ్ మేళా సన్నాహక అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆదివారం బేగంపేట మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి యూనివర్సిటీ విద్యార్థి అభ్యసన సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వైbవెంకటేశ్వర్లు, డాక్టర్ పడాల లక్ష్మణ్, డాక్టర్ శ్రీనివాస్లు హాజరయ్యారు. డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజంలోని అన్నివర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం కోసం సమత ప్రీషిప్ లు, నిపుణ ఫెలోషిప్ లు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఆదివాసీలు, ప్రాచీన గిరిజనులు, ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉచిత విద్య ను అందిస్తుందన్నారు. విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ముందడుగు వేసి ఉజ్వల భవిష్యత్తును పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ అధ్యయన కేంద్రం సిబ్బంది అశోక్, సీనియర్ కౌన్సిలర్ డాక్టర్ వీరయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.















