హైదరాబాద్ జూలై 31 (ఈ తరం భారతం)దర్శన మాత్రం చేత, స్మరణ మాత్రం చేత మనల్ని కరుణించే దైవం శ్రీ కాశీవిశ్వేశ్వరుడని, ఆయన సహస్ర నామావళి ఆధ్యాత్మిక వేత్తలకు శక్తినీ ముక్తినీ ప్రసాదిస్తాయని ‘విదుషీమణి’ డాక్టర్ అనంతలక్ష్మి అన్నారు.శ్రీ మానస ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రి ‘సంఘమిత్ర’ శ్రీమతి కె.హెచ్.ఎస్. జగదంబ రచించిన ‘శ్రీ కాశీ విశ్వేశ్వర నామావళి’ గ్రంథావిష్కరణ సభ మంగళవారం హైదరాబాద్ లోని శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా॥ అనంతలక్ష్మి ‘శ్రీ కాశీ విశ్వేశ్వర నామావళి’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ లయకారంలోనూ ప్రకాశించే అద్భుత శక్తి శ్రీ కాశీ విశ్వేశ్వరుడని, ఆయనను దర్శన మాత్రం చేత, స్మరణ మాత్రం చేసి ప్రసన్నం చేసుకోగలమని అన్నారు. శ్రీ కస్తూరి జగదంబ గారు లయబద్ధంగా, రాగయుక్తంగా పాడుకొనే రీతిన కూడా విశ్వేశ్వరుని సహస్ర నామావళిని రచించి అందించటం అభినందనీయమని అన్నారు.సభకు అధ్యక్షత వహించిన లయన్ డా|| సుజాత రాజశేఖర్ మాట్లాడుతూ- ఎనభై వసంతాల వయస్సులో కూడా జగదంబ గారు భక్తితో, పారవశ్యంతో, అనుభూతి నొంది కాశీ విశ్వేశ్వర సహస్ర నామావళి నందించటం గొప్ప విషయమని అదొక అదృష్టమని అన్నారు.ఇంకా సభలో ప్రముఖ పాత్రికేయురాలు డాక్టర్ పేకేటి గీతాశివరాం, జీవిత భీమా వృత్తి నిపుణులు సూరి సీతారాం, ప్రముఖ పద్యకవి కళ్యాణ శ్రీ, కె. శ్యామలరావు, ఆధ్యాత్మిక కవి బండారుపల్లి రామచంద్రరావు, గ్రంథకర్త జగదంబ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా రచయిత్రి జగదంబను అతిథులు ఘనంగా సత్కరించారు. శ్రీ మానస ఆర్ట్స్ థియేటర్స్ కార్యదర్శి రఘుశ్రీ సభా సమన్యయం గావించారు.















