ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 15
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్లలో గెలుపొందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సోమవారం ఉదయం 11 గంటలకు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే అత్యంత కీలకమైన మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపల్ ఛైర్పర్సన్ మరియు వైస్ ఛైర్పర్సన్ల ఎన్నిక ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఫలితాలు వెలువడి చాలా రోజులు గడిచిన నేపథ్యంలో, ఆయా పదవులను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికతో స్థానిక సంస్థల పాలనలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. నిబంధనల ప్రకారం, గెలిచిన కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లలో కనీసం సగం మంది (50%) హాజరైతేనే కోరం ఉన్నట్లు పరిగణించి ఎన్నికను నిర్వహిస్తారు. ఒకవేళ కోరం లేకపోతే, ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేసే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నిక ప్రక్రియను “చేయి ఎత్తే విధానం” తో పూర్తి చేస్తారు. ఏ అభ్యర్థికి ఎక్కువ మంది మద్దతుగా చేయి ఎత్తుతారో, వారినే విజేతలుగా అధికారులు ప్రకటిస్తారు. ఈ విధానం వల్ల పార్టీల మధ్య బలాబలాలు స్పష్టంగా తేలిపోవడమే కాకుండా, ఎక్స్అఫీషియో ఓట్ల వినియోగం కూడా కీలకం కానుంది.మున్సిపల్ పీఠాలను దక్కించుకోవడంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మేజారిటీ స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ ఉన్న పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేయగా, హంగ్ ఏర్పడిన చోట స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కోసం ప్రధాన పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. అంతేకాకుండా, పార్టీ ఫిరాయింపులు జరగకుండా చాలా చోట్ల క్యాంపు రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం కల్లా రాష్ట్రంలోని ప్రధాన నగరాలు మరియు పట్టణాలకు కొత్త మేయర్లు, ఛైర్పర్సన్లు ఎవరో తెలిసిపోనుంది..















