ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 14
హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న భారీ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ నిర్మాత 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు మరియు ఇతర ముఖ్య నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ వాకిటి శ్రీహరి సహా పలువురు ప్రజా ప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు మరియు ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లనే నేడు అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం, సమాన హక్కులు లభిస్తున్నాయని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. దేశ గమనాన్ని మార్చిన మహనీయుడి వారసత్వాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు.















