ఈతరం భారతం ఫిబ్రవరి హైదరాబాద్ 25:
నడి రోడ్డు మీద తెల్లవారు జామున ఒక వ్యక్తిని కొందరు వెంబడించి హతమార్చారు. దీంతో సదరు వ్యక్తి రోడ్డు మీద రక్తపు మడుగులో కుప్ప కూలీపోయాడు.ఈ ఘటనపై పెద్ద దుమారం రాజుకుంది. ఫ్లైఓవర్ మీద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హైదరాబాద్ నగరంలో మరోసారి దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని భరత్ నగర్ బ్రిడ్జి సమీపంలో తెల్లవారుజామున నడిరోడ్డుపై ఒక వ్యక్తిని కత్తులతో వెంటాడి దుండగులు హత్య చేశారు.మృతుడు శంకర్ (48)గా గుర్తించారు. స్థానికుల సమాచారం ప్రకారం, ఉదయం వేళ రోడ్డుపై నడుస్తుండగా కొందరు వ్యక్తులు అతన్ని వెంటాడి, కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిన శంకర్ ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నగరంలో తెల్లవారుజామున నడిరోడ్డుపై జరిగిన ఈ హత్య స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది.















