ఈతరం భారతం ఖమ్మం, ఆగస్టు 14 శుక్రవారం :
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్సీసీ ఆధ్వర్యంలో గురువారం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఖమ్మంలోని ఎస్ఆర్ & బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
జాతీయ పతాకాలను చేతబూని దేశభక్తి నినాదాలతో కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, క్యాడెట్లు దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటారు. స్వాతంత్ర్య సమరయోధులు, సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి భావాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మిసెస్ ఇండియా ఫస్ట్ రన్నరప్, ఫిట్ ఇండియా అంబాసిడర్ ఎం.ఏ. ఫరా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాతీయ పతాకాన్ని చేతబూని ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులతో కలిసి ఆమె కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతలో దేశభక్తితో పాటు ఆరోగ్యం, ఫిట్నెస్పై అవగాహన పెంపొందించేందుకు ఆమె చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్లు, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, మాజీ సైనికులు, అధికారులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం దేశభక్తి, జాతీయ ఐక్యత, త్రివర్ణ పతాకంపై గౌరవాన్ని ప్రతిబింబించేలా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.















