ఖమ్మం, ఆగష్టు- 22 ఈతరం భారతం :ఉపాధిహామీ పనుల క్రింద సమాజానికి, వ్యక్తులకు ఉపయోగపడే ఆస్తులను సృష్టించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం రఘునాథపాలెం మండలం బుడిదంపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ పర్యటించి పనుల జాతర-2025 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఉపాధిహామీ క్రింద 3 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన లబ్దిదారు అంగడాల నాగమణి కి చెందిన పౌల్ట్రీ షెడ్లు, 1 లక్ష రూపాయల వ్యయంతో నిర్మించిన లబ్దిదారు కేతినేని ద్రౌపది కి చెందిన క్యాటిల్ షెడ్డులను ప్రారంభించారు. లబ్ధిదారులకు ఉన్న వ్యవసాయం, ఎంత మేర భూమి ఉన్నది, ఏ ఏ పంటలు పండిస్తున్నది, రైతు భరోసా ఖాతాల్లో జమ అయిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయంతో పాటు పశు సంపద ను పెంచితే అదనపు ఆదాయంతో, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని కలెక్టర్ తెలిపారు.అనంతరం బుడిదంపాడు గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన గ్రామసభ *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ*, ఉపాధిహామీ క్రింద చేపట్టిన పనులలో పూర్తి అయిన పనులకు ప్రారంభోత్సవాలు, చేపట్టాల్సిన పనులకు శంఖుస్థాపనలు పనుల జాతర-2025 కార్యక్రమంలో చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామంలో పూర్తయిన పౌల్ట్రీ, క్యాటిల్ షెడ్డులకు ప్రారంభోత్సవం చేశామన్నారు. ఉపాధిహామీ అనేది పని కల్పనకు చట్టరీత్యా ఉన్న హక్కని కలెక్టర్ అన్నారు. ఇంతకుముందు పూడికతీత తదితర పనులు ఉపాధిహామీ ద్వారా చేపట్టేవారని, కాలక్రమేణా సమాజానికి, గ్రామస్థులకు అందరికి ఉపయోగపడే పనులు చేపడుతున్నారని తెలిపారు. ప్లాంటేషన్, పామాయిల్ తోటల పెంపకం, సామాజిక, వ్యక్తిగత ఆస్తుల కల్పన కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అన్నారు. ఉపాధిహామీ ద్వారా 262 రకాల పనులు పూర్తి ఉచితంగా పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. ఇందులో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు, ప్లాంటేషన్, తోటల పెంపకం, రహదారులు, పౌల్ట్రీ, గేదెలు, మేకలు, గొర్రెల షెడ్లు, సామాజిక, వ్యక్తిగత ఆస్తుల కల్పన తదితరాలున్నాయన్నారు. మెటీరియల్, వేజ్ కాంపోనెంట్ ల ద్వారా 100 రోజుల పని కల్పిస్తున్నట్లు అన్నారు.
ఈ సంవత్సరం 67 కోట్ల రూపాయల వ్యయంతో ఉపాధిహామీ పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ అన్నారు. గ్రామానికి సంబంధించి అవసరమైన పనులు గ్రామసభ తీర్మానం తో చేపడతామన్నారు. గ్రామసభలు పటిష్టంగా నిర్వహించాలన్నారు. ఉపాధిహామీ పనుల నిర్వహణలో బుడిదంపాడు గ్రామం ఆదర్శంగా నిలవాలని, చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ అన్నారు. వంద రోజుల ఉపాధిహామీ పని పూర్తిచేసిన వారిని, దివ్యాoగ ఉపాధిహామీ కూలీ పేరం రమాదేవిని ఈ సందర్భంగా కలెక్టర్ సన్మానించారు. పౌల్ట్రీ, క్యాటిల్ షెడ్ లబ్ధిదారులు అంగడాల నాగమణి, కేతినేని ద్రౌపది లకు యూనిట్ కు సంబంధించి చెక్కులను కలెక్టర్ అందజేశారు.గ్రామంలో సమస్యలు, పారిశుద్ధ్యం గురించి సంబంధిత అధికారులకు, కలెక్టర్ ఆదేశాలిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డీవో ఎన్. సన్యాసయ్య, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, రఘునాథపాలెం మండల ఎంపిడివో అశోక్ కుమార్, తహసీల్దార్ శ్వేత, ఎంపీవో శ్రీనివాస రెడ్డి, ఆత్మా కమిటీ చైర్మన్ వెంకటేశ్వర రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సయ్య, బుడిదంపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్, అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.















