ఈతరంభారతం వైరా జూలై 13 : ప్రజలతో పాటు స్వయానా కాంగ్రెస్ నాయకులే బహిరంగ విమర్శలు చేస్తున్నప్పటికీ వైరా తహసీల్దార్ కార్యాలయంలోని కొంతమంది అధికారుల తీరు మారడం లేదు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రేషన్ కార్డు మంజూరు ప్రక్రియ ఈ కార్యాలయంలో గడప దాటడం లేదు. ఇక్కడ ప్రజలకు దరఖాస్తుదారులకు సరైన సమాధానం చెప్పే వారే కరువయ్యారు. దీంతో మండల ప్రజలు వామ్మో వైరా తహసీల్దార్ కార్యాలయమా….! అంటూ నిట్టూరు స్తున్నారు. వైరా మండలం లో సుమారు వెయ్యి నుంచి 11 వందల మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తులపై విచారణ నిర్వహించాల్సిన ఓ అధికారి తన నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో సుమారు 400 దరఖాస్తులు కూడా విచారణ పూర్తి కాలేదని తెలుస్తుంది.ఇంకా 600కు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా అనేకమంది మీ సేవలో ఆన్లైన్ చేసి తహసీల్దార్ కార్యాలయంలో ఇచ్చిన రేషన్ కార్డు దరఖాస్తులు మాయమయ్యాయి. దీంతో ఆ దరఖాస్తుదారులు తాము మీ సేవలో దరఖాస్తు చేసుకున్నామని రసీదులు చూపిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా కుల ఆదాయ సర్టిఫికెట్ల మంజూరులో కూడా జాప్యం జరుగుతుందని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ పనిచేసే ఓ గిర్దావర్ దరఖాస్తుదారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత రెండు రోజుల క్రితం కొంతమంది దరఖాస్తుదారులు గిర్ధా వర్ ని కలిసి తమ రేషన్ కార్డుల దరఖాస్తులు విచారించాలని విజ్ఞప్తి చేశారు. అయితే మీ దరఖాస్తులు మా వద్ద లేవని మరలా దరఖాస్తులు తీసుకురావాలని గిర్దావర్ తెలిపినట్లు బాధితులు వాపోయారు.
తాము మీసేవ రసీదులు చూపించినప్పటికీ గిర్దావర్ కనీసం పట్టించుకోక పోగా దురుసుగా ప్రవర్తించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యాలయంలో రేషన్ కార్డు తో పాటు ఇతర పనులు చేసేందుకు చేతులు తడపాల్సిన పరిస్థితిలు ఏర్పడ్డాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కొంతమంది కాంగ్రెస్ నాయకులు సైతం కాసులు ఇవ్వనిదే వైరా తహసీల్దార్ కార్యాలయంలో ఎలాంటి పని కావడం లేదని స్వయాన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కార్యాలయంలో కొంతమంది అధికారుల తీరు మారడం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వైరా తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ కార్డు దరఖాస్తుల విచారణ వేగవంతం చేయించాలని మండల ప్రజలు కోరుతున్నారు.















