ఖమ్మం, ఆగస్టు -23: ఈతరంభారతం :
విద్యార్థుల్లో అభిరుచి, ఆసక్తిని బట్టి ఆటలు, సంగీతం, నృత్యం, కళలు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రోత్సహించడమే బ్యాగ్ లెస్ డే ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. పిల్లలకు చదువుల ఒత్తిడిని తగ్గిస్తూ, ఏకాగ్రతను పెంచుతూ ఉల్లాసపూరిత వాతావరణం ఉండేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.శనివారం, నెలలో నాలుగవ శనివారం నిర్వహించే బ్యాగ్ లెస్ డే కార్య్రకమంలో భాగంగా స్థానిక ఇందిరనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. విద్యార్ధులు కాగితపు బొమ్మలు పూలతో కలిపి చేసిన పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలకడంతో కలెక్టర్ మురిసిపోయారు. పిల్లలు తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్స్, పోస్టర్ డిజైనింగ్, ఫజిల్స్ సాల్వింగ్, పేపర్ తో చేసిన పలు ఆకృతులను కలెక్టర్ తిలకించారు. నృత్యం, సంగీతం, పలు గీతాలు, గేయాలాపన, ప్రసంగాలు వంటి ప్రదర్శనలను ఆస్వాదించారు. ముఖ్యంగా మట్టి, పిండితో వినాయక విగ్రహాలు తయారు చేసిన విద్యార్థుల సామర్థ్యాన్ని కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూపాఠశాలల్లో విద్యార్థులపై పుస్తకాలు, హోంవర్క్ బరువును తగ్గించి, ఆటపాటలు, క్రీడలు, కళలు, పర్యావరణ పరిరక్షణ అవగాహన, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు వీలు కల్పించడం, చదువులపై ఏకాగ్రత పెంచడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. విద్యార్థులు తమ బరువైన బ్యాగులను నెలలో ఒక్కసారైనా పాఠశాలలకు తీసుకెళ్లకుండా ఆనందాన్ని కలిగించేందుకు వీలును బట్టి మ్యూజియం, చారిత్రక ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల సందర్శన, సైన్స్ ప్రయోగాలు, విద్యపై స్కిట్, పతంగుల తయారీ, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గణిత కార్నర్, రంగోలి, మోడల్ ఎన్నికలు, మాక్ అసెంబ్లీ, ఆర్థిక లావాదేవీల నిర్వహణ, బేస్డ్ లెర్నింగ్, ఆటలు, సంగీతం, నృత్యం, కళలు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడానికి విద్యార్ధులకు అవకాశం లభిస్తుందని తెలిపారు.
విద్యార్థులు తమ ఉత్తమ రచనలను కళాత్మక రూపంలో ప్రదర్శించడానికి ఆసక్తిగా పాల్గొంటారని, సెలవుదినానికి ముందు రోజు విద్యార్థులు సంతోషంగా ఉండటం చాలా బాగుంటుందని అన్నారు. సమూహంగా నైపుణ్య కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు కలుగుతుందని తెలిపారు. ప్రతి నెలలో నాలుగో శనివారం జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో బ్యాగ్ లెస్ డే గా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.పండుగలు, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతగా వినాయక చవితి పండుగ రోజున మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని కలెక్టర్ కోరారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కన పెట్టి, పర్యావరణ హిత మట్టి గణపతులకు ప్రాధాన్యమిద్దామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపునిచ్చారు. కలెక్టర్ సందర్శన సమయంలో ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.















