యాదగిరిగుట్ట , ఆగస్టు 5 (ఈతరం భారతం);: తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వడివడిగా అడుగులు వేస్తోంది. నిత్యం వేలాదిగా వచ్చే భక్తులకు ఉత్తమ సేవలు అందించేందుకు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఎస్. వెంకట్రావు చేస్తున్న కృషికి స్థానిక భక్తుల నుండి కూడా హర్ష వ్యక్తం అవుతోంది. కార్యాలయ పనితీరు పేపర్ లెస్ గా మార్చేందుకు,పాలనలో పారదర్శకత ,అధికారులు ,సిబ్బందిలో జవాబుదారితనం పెంచేందుకు, పనుల సమర్థతను మెరుగుపరిచేందుకు ఉపయుక్తమైన ఈ _ ఆఫీస్ వ్యవస్థను దేవస్థానంలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఈనెల రెండవ తేదీన దేవస్థానం ఉద్యోగస్తులందరికీ శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ నిపుణులు ఉద్యోగులకు డిజిటల్ సంతకాల వినియోగం ,అలాగే ఫైళ్ళ ఆన్లైన్ ట్రాకింగ్, ఈ _ ఆఫీస్ ద్వారా పనితీరు వెలుగుదలపై సంపూర్ణ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ ఈ_ ఆఫీసు అమలుతో భక్తులకు వేగవంతంగా, నాణ్యమైన, పారదర్శకమైన సేవలను అందించగలుగుతామని అన్నారు .ఇదిలా ఉండగా ఈ_ ఆఫీస్ ను ఈనెల 15వ తేదీ పంద్రాగస్టు రోజున అధికారికంగా ప్రారంభించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది.















