EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది

హైదరాబాద్ మార్చి 27 (ఈతరం భారతం);: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఎందుకు మాట్లాడడం లేదని అధికారి పార్టీ నేతలను కెటిఆర్ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెసోళ్లు మాట్లాడకపోవడం బాధేసిందన్నారు. ప్రతి పనిలో గత ప్రభుత్వమని తమని విమర్శిస్తున్నారని, కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెసోళ్లు ఎందుకు మాట్లాడతాలేరన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రం అనుకరిస్తోందని, మనకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడకపోవడం బాధేసిందని పేర్కొన్నారు.పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని విమర్శించారని, మాకు వచ్చింది సున్నానే కానీ మరి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నా కాదా? అని చురకలంటించారు. కొట్లాడకపోతే కేంద్రం నిధులు కూడా ఇవ్వదని, పోరాడాల్సిందేనని, కేంద్రంతో గట్టిగా మాట్లాడేందుకు తాము కూడా మద్దతిస్తామని, సత్సంబంధాలు ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, తాము కూడా కేంద్రంతో సఖ్యతతో ఉన్నామని, ఏమీ రాలేదన్నారు. తెలంగాణలో ప్రముఖ ఆలయాలకు కేంద్రం ఒక్క రూపాయైనా ఇచ్చిందా?, సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని, కుంభమేళాకు కేంద్రం నిధులు ఇస్తుందని, సమ్మక సారలమ్మ జాతరకు ఎందుకు నిధులు ఇవ్వరని నిలదీశారు. మనం అడగకపోతే కేంద్రం నిధులు ఇవ్వదని, తెలంగాణకు మేలు జరగాలని, తెలంగాణ ప్రజలు బాగుండాలని, అధికారంలో ఏ పార్టీ ఉన్నా తెలంగాణ బాగుండాలన్నదే తమ సంకల్పమని కెటిఆర్ స్పష్టం చేశారు. పదవులు శాశ్వతం కాదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు.

Related News

Select the Topic
Scroll to Top