కామారెడ్డి మార్చి 29 (ఈ తరం భారతం );: కాంగ్రెస్ చేసిన కులసర్వే ద్వారా బీసీల జనాభా తగ్గించి.. ఓసీల జనాభాను పెంచారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. తెలంగాణ జాగృతి , యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో ఇవాళ శనివారం బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. రౌంట్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాలు, కులాల వారీగా రేవంత్ ప్రభుత్వం జనాభా లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంబీసీ కులాలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని అన్నారు. ఇంత వరకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. కామారెడ్డి డిక్లరేషన్లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలిపారు. కానీ తమ పోరాటం వల్ల విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ చట్టాలు చేసిందని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. బీసీల బిల్లులను కేంద్రం ప్రభుత్వం ఆమోదించేలా బీజేపీ నేతలు ఒత్తిడి తేవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. ఈ బిల్లులను కేంద్రం ఆమోదించడంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సమాధానం చెప్పాలని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 52 శాతం అని తేలిందని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చిందని.. దాంతో తెలంగాణలో రిజర్వేషన్లు 54 శాతం అమలవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో 50 శాతం పరిమితి మించింది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేశామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.














