ఈ తరం భారతం సూర్యాపేట అక్టోబర్ 12 :ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ -2 కు దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఎస్సార్ఎస్పీ-2గా నామకరణం చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. తుంగతుర్తిలో జరిగిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ వారు సేవలను స్మరించుకున్నారు. “రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి మరణం అత్యంత బాధాకరం. పార్టీ కోసం, కార్యకర్తల కోసం సొంత ఆస్తులను త్యాగం చేసిన నిస్వార్థ నాయకుడు. అయిదు సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి గారు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వారసత్వంగా వచ్చిన వేలాది ఎకరాల భూములను ప్రజా ప్రయోజనాల కోసం అర్పించారు.నల్గొండ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల కోసం గోదావరి జలాలను తరలించడానికి అలుపెరగని పోరాటం చేశారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు స్టేజ్ -2 ద్వారా నల్గొండ జిల్లాకు గోదావరి జలాలు తరలించాలని ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్సార్ఎస్పీ స్టేజ్-2 ప్రారంభమయ్యేలా పోరాటం చేశారు. అందువల్ల ఎస్సార్ఎస్పీ స్టేజ్-2 కి రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడం వారికిచ్చే నిజమైన నివాళి…” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.














