ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 20
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన కవి, రచయిత డాక్టర్ తిరునగరి శ్రీనివాస్ ప్రసార భారతి ఆధ్వర్యంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం నిర్వహించిన జాతీయ సర్వ భాషా కవి సమ్మేళనంలో అనువాద కవిగా పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని డా. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో మొత్తం 22 భారతీయ భాషల అనువాద కవులతో నిర్వహించిన ఈ జాతీయ కవి సమ్మేళనంలో కొంకిణి భాషలో రమేష్ ఘాడి రాసిన మూల కవితకు ‘నాకది…అస్సలు పట్టింపు కాదు’ శీర్షికతో తెలుగు అనువాదం చేసిన డాక్టర్ శ్రీనివాస్ ఆ కవితను ఈ జాతీయ సమ్మేళనంలో చదివి వినిపించారు. ప్రసార భారతి ఉన్నతాధికారి భానోత్ సింగ్, ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ వెలుదండ నిత్యానంద రావు, హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ రమేష్, ప్రముఖ వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తి జాతీయ కవి సమ్మేళనంలో కవిత చదివిన శ్రీనివాస్ ని సన్మానించారు. ఈ సంవత్సరపు జాతీయ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి, అనువాద కవులు దేశపతి శ్రీనివాస్, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, డాక్టర్ మామిడి హరికృష్ణ, తాడేపల్లి పతంజలి, దర్భశయనం శ్రీనివాసాచార్య, సుధామ, యార్లగడ్డ రాఘవేంద్రరావు, డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని, డాక్టర్ జె చెన్నయ్య, పసునూరి రవీందర్, మెర్సీ మార్గరెట్, ఆకాశవాణి అధికారులు తదితరులు ఈ జాతీయ కవి సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు.















