EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జాతర కీలక ఘట్టం ఆవిష్కృతం కన్నెపల్లి నుంచి గద్దెపైకి కొలువు తీరిన సారలమ్మ

ఈతరం భారతం ములుగు జనవరి 28

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం బుధవారం భక్తి పరవశ్య వాతావరణంలో ఆవిష్కృతమైంది. కోట్లాది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఘడియ సాయంత్రం ప్రారంభమవగా, కన్నెపల్లి నుంచి గద్దెపైకి శ్రీ సారలమ్మ కొలువు తీరడం జాతరలో తొలి ప్రధాన ఘట్టంగా నిలిచింది.ఈ ఘట్టానికి ముందుగా పూజారులు, జిల్లా యంత్రాంగం కన్నెపల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క దేవతల పూజారులు సిద్ధబోయిన వారి ఇంటికి చేరి సంప్రదాయ కార్యక్రమాలు చేపట్టగా, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజుల దేవతను కన్నెపల్లికి తీసుకువచ్చారు. అనంతరం శ్రీ సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య,పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక కిరణ్ కుమార్, కాక కనకమ్మ, కాక భుజంగరావు, కాక లక్ష్మీబాయి లతో పాటు గోవిందరాజుల పూజారి దుబ్బకట్ల గోవర్ధన్‌లు కలిసి ఆదివాసీ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దాదాపు రెండు గంటల పాటు కన్నెపల్లి సారలమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సుమారు సాయంత్రం 7, గంటలకు సారలమ్మ అమ్మవారు కన్నెపల్లి నుంచి బయలుదేరారు. జంపన్న వాగు మీదుగా మేడారం గ్రామానికి చేరుకున్న సందర్భంగా పూనకాలతో తన్మయత్వానికి లోనైన భక్తులు, డప్పు వాయిద్యాల నడుమ దారి పొడవునా అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. ఈ ఘట్టంతో మేడారం పరిసరాలు భక్తి పరవశ్యంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

రాత్రి 12.30 గంటలకు గద్దెల ప్రాంతానికి చేరుకున్న సారలమ్మ అమ్మవారికి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవిందరాజులు, పగిడిద్దరాజులతో కలిసి అర్ధరాత్రి గద్దెపైకి అమ్మవారు చేరుకున్నారు. ప్రధాన పూజారి సారయ్య అమ్మవారిని గద్దెలపైకి తీసుకొచ్చి కొలువు తీర్చారు.

ఈ ఘట్టానికి ముందు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్‌లు శ్రీ సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కన్నెపల్లి గ్రామస్తులతో కలిసి ఆదివాసీ గిరిజన సంప్రదాయా నృత్యాల్లో పాల్గొని జాతర ఆధ్యాత్మికతను మరింత పెంచారు.దీంతో మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో తొలి కీలక ఘట్టం విజయవంతంగా పూర్తికాగా, కొంగుబంగారు తల్లి శ్రీ సారలమ్మ గద్దెపై కొలువు తీరుతూ భక్తులకు దీవెనలు ఇస్తోంది. ఇక జాతరలోని తదుపరి ఘట్టాల కోసం భక్తజనం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.

Related News

Select the Topic
Scroll to Top