ఈతరం భారతం యాదాద్రి భువనగిరి మే 23 :
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో సంప్రదాయ వేద విద్యను బోధించే గురుకులం ఏర్పాటవ్వనుంది. రూ.43.79 కోట్లతో క్షేత్రంలోని పెద్దగుట్ట ఆలయనగరి లేఅవుట్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నటువంటి వేద పాఠశాల భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి సమక్షంలో ఈ క్రతువు జరిగింది. మొత్తంగా రూ.100 కోట్లతో చేపట్టే thu in పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ప అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
వచ్చే రెండేళ్లలో వేదపాఠశాల నిర్మాణం పూర్తిచేసి తరగతులు ప్రారంభించనున్నారు. దీంతో పాటు రూ.1.41 కోట్లతో మెట్లమార్గానికి పైకప్పు, రూ.1.44 కోట్లతో మాడ వీధులకు మెట్లు, రూ.43.5 కోట్లతో దీక్షాపరుల మండలం పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న వేదపాఠశాలలో కంచి కామకోటి పీఠం పర్యవేక్షణలో బోధన చేపట్టనున్నారు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదంతోపాటు ఆగమ శాస్త్రాన్ని అధ్యయనం చేసేందుకు వీలు కల్పించి విద్యార్థులకు పట్టాలు అందించనున్నారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ లు పాల్గొన్నారు.














