ఈతరం భారతం హైదరాబాద్ జూలై 14
పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా తాము చేపట్టిన బంద్ విజయవంతం అయ్యిందని ఏబీవీపీ తెలంగాణ శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది SC,ST,BC,EBC,మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడి చదువుకుంటున్నారని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేస్తే విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయని రాష్ట్ర కార్యదర్శి రాంబాబు అన్నారు.పేదవాడికి ఇంజనీరింగ్, మెడిసిన్, లా వంటి చదువులు అందని ద్రాక్షగా మిగులుతాయన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా అనేక పేద కుటుంబాలు ఆర్థికంగా,సామాజికంగా ఉన్నతంగా ఎదిగాయన్నారు.ప్రభుత్వం సరైన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా 11000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని మండిపడ్డారు.ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రతి యేట 2 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారని,విద్యార్థులు సర్టిఫికెట్స్ తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.ఇక్కడి విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వలసవెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు.
గతంలో ఉన్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తుంగలో తొక్కుతూ పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నదని,మా ప్రభుత్వంలో బకాయిలు చెల్లించడంతో పాటుగా,గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతి నెల ఫీజులు చెల్లిస్తామని చెప్పిన నేటి ముఖ్యమంత్రి తానే విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈ విషయం కోర్టు మెట్లు ఎక్కిందనీ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని,ప్రభుత్వం కళ్ళు తెరవాలని,లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని రాంబాబు హెచ్చరించారు















