ఈతరం భారతం భద్రాద్రి కొత్తగూడెం జూలై 20
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:బూర్గంపాడు మండలంలోని అంజనాపురం–జింకలగూడెం ప్రధాన రహదారిపై ఉన్న సీతారామ ప్రాజెక్టు కెనాల్ బ్రిడ్జి ప్రస్తుతం అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంది. బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకల కారణంగా కాంక్రీట్ పూర్తిగా దెబ్బతిని, ఇనుప రాడ్లు బయటకు వచ్చాయి. రహదారిపై ఏర్పడిన భారీ గోతుల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, పలుమార్లు ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ మార్గంలో ప్రతిరోజూ వేలాది వాహనాలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ప్రయాణిస్తున్నప్పటికీ, బ్రిడ్జి మరమ్మతులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, బ్రిడ్జి దెబ్బతిన్న విషయం సంబంధిత అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వారు చెబుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ఎలాంటి ప్రాణనష్టం జరగకముందే అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
గ్రామస్థుల విజ్ఞప్తి:
సంబంధిత నేషనల్ హైవే, సీతారామ ప్రాజెక్టు మరియు రోడ్లు–భవనాల శాఖ అధికారులు వెంటనే ఈ బ్రిడ్జిని పరిశీలించి, దెబ్బతిన్న భాగాలను అత్యవసరంగా మరమ్మతు చేసి ప్రజలకు సురక్షిత రాకపోకలు కల్పించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.















