ఈతరం భారతం అమరావతి సెప్టెంబర్ 5 శనివారం
_________________________________________
ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో ఉద్యోగ సంఘాల నేతలతో సుదీర్ఘంగా సాగిన భేటీలో వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి సంచలన ప్రకటనలు చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమని, బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం తీసుకున్న వరాల నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ పూర్తి సంతృప్తి చెందారు.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన 12వ వేతన సవరణ సంఘం (AP PRC 2026) నియామకానికి సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. దీంతో పాటు పెండింగ్లో ఉన్న రెండు డీఏలను (1-7-2024, 1-1-2025) 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లించేందుకు ఓకే చెప్పారు. ఇక 2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్ల బకాయిలను వచ్చే సంక్రాంతి నాటికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే పోలీసులకు దసరా కానుకగా ఒక అదనపు సరెండర్ లీవ్ను విడుదల చేసేందుకు సమ్మతించారు.విశ్రాంత ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 2027 జనవరి నుంచి ‘అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్’ అమలు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం మేర అదనపు పెన్షన్ లభించనుంది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను (EHS) బలోపేతం చేస్తూ, ప్రతి నెలా నిధులను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కు రెగ్యులర్గా చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వంపై ప్రతిఏటా రూ.2,880 కోట్లదనపు భారం పడనుంది.















