ఈతరం భారతం తిరుపతి జూలై 23 రిపోర్టర్ మనోజ్ కుమార్ :
ఎల్నినో ప్రభావంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశాల దృష్ట్యా జిల్లాలో అర్హత కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా పంటల బీమా నమోదు చేసుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పంటల బీమా నమోదుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, సీఎస్సీ కేంద్రాలు, బ్యాంకులు, రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ శాఖల అధికారులు కలిసి రైతులకు అవగాహన కల్పించి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ-క్రాప్, ఆధార్, భూ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు సక్రమంగా నమోదు చేసి రైతులకు రసీదులు అందేలా చూడాలని, మండలాల వారీగా పురోగతిని ప్రతిరోజూ సమీక్షించి నిర్ణీత గడువులో లక్ష్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.















