ఈతరం భారతం తిరుపతి జూలై 23 :(కరస్పాండెంట్ మనోజ్ కుమార్)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి కుటుంబానికి చెందిన భూములను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని చేపట్టిన చర్యలను తిరుపతి లోక్సభ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు.రాజకీయ కక్షతో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. భూమన కరుణాకర రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే ఆయన కుటుంబ ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు.చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు అధికార పార్టీ రాజకీయ ప్రతీకారానికి సాధనాలుగా మారడం ఆందోళనకరమని గురుమూర్తి పేర్కొన్నారు. రాజకీయ భేదాభిప్రాయాల పేరుతో వ్యక్తిగత ఆస్తులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో ప్రమాదకర ధోరణి అని ఆయన అన్నారు.
ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ప్రయత్నాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు భూమన కరుణాకర రెడ్డి గారు భయపడే వ్యక్తి కాదని, ఇలాంటి కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, రాజకీయ వేధింపులు, కక్షపూరిత చర్యలను వెంటనే నిలిపివేయాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.















