ఈతరం భారతం ll హైదరాబాద్ ll ఆగస్ట్ ll 12
వైద్య విద్యను అభ్యసించాలనుకునే నిరుపేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ‘నీట్ యుజి-2027’ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) ఆధ్వర్యంలో ఉచితంగా ‘లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్’ అందించేందుకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-26 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, 2026లో నీట్ పరీక్ష రాసిన అర్హులైన విద్యార్థులు ఈ కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత మరియు ప్రతిభ ఆధారంగా మొత్తం 100 మంది బాలికలు, 100 మంది బాలురు.. మొత్తం 200 మంది విద్యార్థులను ఈ ప్రత్యేక ఉచిత లాంగ్ టర్మ్ శిక్షణ కోసం ఎంపిక చేయనున్నారు.ఈ ఉచిత శిక్షణా కార్యక్రమానికి హాజరుకావాలనుకునే అభ్యర్థులు ఆగస్టు 22వ తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు అత్యుత్తమ సదుపాయాలతో కూడిన ఉచిత వసతి, భోజనం మరియు నిపుణులైన అధ్యాపకులతో నాణ్యమైన కోచింగ్ అందించనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఈ కోచింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ శిక్షణ సంస్థలలో లక్షలాది రూపాయలు వెచ్చించలేని పేద విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందని, ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని ఎంబీబీఎస్ సీటు సాధించేలా వారిని తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని అధికారులు వెల్లడించారు.















