ఈతరం భారతం తిరుపతి, సెప్టెంబరు 01రిపోర్టర్ మనోజ్ కుమార్
___________________________________________________
ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ అసోసియేషన్ 95-48/2000 రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తిరుపతి ఆర్ఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా గౌరవ అధ్యక్షులు టి.ఆర్.ఎస్. మన్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వి. పెంచల నరసింహారెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టి. సుబ్రహ్మణ్యం, ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈస్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెంచల నరసింహారెడ్డి మాట్లాడుతూ ఏళ్ల తరబడి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యానికి పలుమార్లు విన్నవించినా స్పందన లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించే వరకు ఇతర ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్ల మద్దతుతో పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ప్రోరేటా పెన్షన్ విధానాన్ని అమలు చేయరాదని, పీఎఫ్ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించాలని డిమాండ్ చేశారు. హయ్యర్ పెన్షన్ కోసం 1996–2014 మధ్య జీతాల నుంచి మినహాయించిన పీఎఫ్ మొత్తాన్ని, డీడీల ద్వారా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరారు. 58 ఏళ్ల తర్వాత 62 ఏళ్ల వరకు రికవరీ చేసిన పీఎఫ్ మొత్తాన్ని కూడా ఉద్యోగులకు చెల్లించాలని, సుమారు రూ.32 కోట్లు పీఎఫ్ కార్యాలయంలో ఉన్నాయని తెలిపారు. 2013–2017 నిజ వేతనాలపై హయ్యర్ పెన్షన్, పెండింగ్లో ఉన్న ఎర్నెడ్ లీవ్ ఎన్క్యాష్మెంట్, గ్రాట్యుటీ బకాయిలు చెల్లించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు బస్సు పాస్తో పాటు తెల్ల రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎన్. రెడ్డి, జి. సుధాకర్, ఎస్.జె. ప్రకాష్, జి.ఎస్. మన్యం, వి.ఎస్. మన్యం, వి.ఆర్. నాయుడు, కె.ఎం.వి. రాయలు, పి.కె. రెడ్డి, పి. చిన్నపరెడ్డి, జి. జయరామయ్య, ఎం.కె. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.















